Vijay Sai Reddy: లోకేశ్ కోసం ప్రకాశం బ్యారేజ్ ని కూడా అడిగే సమర్ధులు మీరు!: విజయసాయి రెడ్డి ఎద్దేవా

  • ఉండవల్లి ప్రజా వేదిక విషయంలో విభేదాలు
  • చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టుకు అడుగుతారేమో
  • ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
  • ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి విమర్శలు

ఉండవల్లిలోని ప్రజా వేదికను తమకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ కోరడం, ఆపై దాన్ని తమకే ఇవ్వాలంటూ సీఎస్ కు వైసీపీ లేఖరాసిన తరువాత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "యనమల గారూ... మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు!" అని అన్నారు.

 ఆ తరువాత మరో ట్వీట్ పెడుతూ, "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ  మాఫియాను సృష్టించి  ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?" అని ప్రశ్నించారు.

More Telugu News