Jagan: పార్టీ కోసం చాలా కష్టపడ్డా... జగన్ గుర్తిస్తారనే అనుకుంటున్నా: రోజా కీలక వ్యాఖ్యలు

  • 9 సంవత్సరాలు కష్టించి పనిచేశా
  • నేను గోల్డెన్ లెగ్ నని నిరూపించుకున్నా
  • జగన్ ఏ బాధ్యత ఇచ్చినా ఓకేనన్న రోజా

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపు 9 సంవత్సరాల పాటు కష్టపడ్డానని, వైఎస్ జగన్ తన కష్టాన్ని గుర్తిస్తారనే అనుకుంటున్నానని మహిళా నేత రోజా వ్యాఖ్యానించారు. నమ్ముకున్నవారిని, కష్టించి పనిచేసే వారిని గుర్తించడంలో జగన్ ఎప్పుడూ ముందుంటారని రోజా అన్నారు. నేడు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా, సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన రోజా, మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీలో తనను ఎంతో ఇబ్బంది పెట్టారని, కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశంలో తాను ఉద్యమిస్తే, పోలీసులతో అరెస్ట్ చేయించారని, ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారని రోజా గుర్తు చేసుకున్నారు.

తాను వైఎస్ జగన్ తో ఉంటే, ఎక్కడ ఎదిగిపోతానన్న భయంతో తనను ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారని, కానీ తాను గోల్డెన్ లెగ్ నని నిరూపించుకున్నానని అన్నారు. తనకు ఏ పదవి ఇచ్చినా, పార్టీకి మంచి పేరును తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. కాగా, జగన్ మంత్రివర్గంలో రోజాకు మహిళల కోటా కింద స్థానం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News