Tamil Nadu: తమిళనాడులో దుకాణాల నిర్వాహకులకు శుభవార్త.. ఇక 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చు!

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
  • మహిళా ఉద్యోగులకు పూర్తిగా రక్షణ కల్పించాల్సిందే
  • ఉద్యోగుల పేర్లు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి

తమిళనాడులోని దుకాణదారులు, మాల్స్ యజమానులకు ఇది గొప్ప శుభవార్తే. ఇకపై వారంలో 24 గంటలూ దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చంటూ పళనిస్వామి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, తొలుత దీనిని మూడేళ్ల కాలానికి మాత్రమే పరిమితం చేశారు. అయితే, ఈ క్రమంలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా దుకాణదారులదేనని నిబంధన విధించింది. నైట్ షిఫ్టులలో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.

అలాగే, ఉద్యోగుల కోసం విశ్రాంతి గదులు, వాష్‌రూములు, సేఫ్టీ లాకర్లతోపాటు కనీస మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని కూడా పేర్కొంది. ఉద్యోగులతో 8 గంటలకు మించి పనిచేయించరాదని, వారంలో 48 గంటలు దాటరాదని స్పష్టంగా పేర్కొంది. ఓవర్ టైమ్ కూడా రోజులే 10.5 గంటలు దాటరాదని ప్రభుత్వం పేర్కొంది.

More Telugu News