Telangana: కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై.. కేటీఆర్ తో భేటీ అయిన రోహిత్ రెడ్డి!

  • త్వరలోనే టీఆర్ఎస్ లో చేరే ఛాన్స్
  • కాంగ్రెస్ రెబెల్స్ కు కేటీఆర్ విందు
  • సీఎల్పీ విలీనానికి లేఖ ఇచ్చే ఛాన్స్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈరోజు ప్రగతి భవన్ కు చేరుకున్న రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లోకి చేరడంపై ఆసక్తి చూపగా, కేటీఆర్ స్వాగతించినట్లు సమాచారం.

గతంలో టీఆర్ఎస్ నుంచి రోహిత్ రెడ్డి బహిష్కరణకు గురయ్యారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 11 మంది ఇప్పటికే టీఆర్ఎస్ లో కి చేరిపోయారు. తాజాగా రోహిత్ రెడ్డి చేరికతో ఈ సంఖ్య 12కు చేరుకోనుంది.

మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో సభలో కాంగ్రెస్ బలం 6కు పడిపోనుంది. మరోవైపు టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఈరోజు విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారంతా ప్రగతి భవన్ కు చేరుకున్నట్లు సమాచాం. సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ కు వీరంతా లేఖను అందజేయనున్నట్లు సమాచారం.

More Telugu News