Andhra Pradesh: అన్న నుంచి స్మార్ట్‌ఫోన్ లాక్కునే ప్రయత్నం.. తోసివేయడంతో కిందపడి మృతి చెందిన బాలిక

  • గుంటూరులోని ఉప్పలపాడులో ఘటన
  • తలకు బలంగా దెబ్బ తాకడంతో అక్కడికక్కడే మృతి
  • విషాదంలో కుటుంబం

అన్నాచెల్లెళ్ల మధ్య స్మార్ట్‌ఫోన్ కోసం జరిగిన గొడవలో బాలిక మృతి చెందింది. అన్నచేతిలో నుంచి స్మార్ట్‌ఫోన్ లాక్కునేందుకు చిన్నారి ప్రయత్నించగా, అన్న బలంగా తోసివేశాడు. దీంతో కిందపడిన బాలిక అక్కడికక్కడే చనిపోయింది. గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడులో జరిగిందీ ఘటన. జిల్లాలోని చినకొండాయపాలేనికి చెందిన గోరంట్ల విజయలక్ష్మి (13) ఏడో తరగతి పూర్తి చేసింది.

వేసవి సెలవుల కోసం అమ్మమ్మ గారి ఊరైన ఉప్పలపాడుకు వచ్చింది. నాలుగు రోజుల క్రితం బాలిక అన్న, తల్లి రాజ్యం కూడా ఉప్పలపాడు వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం నవీన్ స్మార్ట్‌ఫోన్‌లో ఆడుకుంటుండగా దగ్గరికి వెళ్లిన విజయలక్ష్మి తనకు ఫోన్ ఇవ్వాలని అడిగింది. అతడు అందుకు నిరాకరించడంతో అతడి చేతిలోని ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో చెల్లెల్ని నవీన్ బలంగా నెట్టివేశాడు. దీంతో కిందపడిన విజయలక్ష్మి తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News