Galla Jayadev: తన నివాసంలో నాని, గల్లా జయదేవ్‌లతో సమావేశమైన చంద్రబాబు

  • మనస్తాపానికి గురైన నాని
  • ఇఫ్తార్ విందుకు కూడా గైర్హాజరు
  • విప్ పదవిని తిరస్కరిస్తూ పోస్ట్

కొద్ది సేపటి క్రితం టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్‌సభా పక్ష నేతగా, నానిని లోక్‌సభలో టీడీపీ విప్ గా పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో కేశినేని మనస్తాపానికి గురయ్యారు. చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు కూడా నాని గైర్హాజరయ్యారు.

నేటి ఉదయం సోషల్ మీడియాలో లోక్‌సభలో టీడీపీ విప్ పదవిని తిరస్కరిస్తూ ఆయన పెట్టిన పోస్టు రాజకీయంగా ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో గల్లా జయదేవ్ నానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి తన నివాసానికి రావాలని కోరడంతో గల్లాతో కలిసి నాని ఆయన నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ భేటీలో నాని అలక, తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  

More Telugu News