Kishan Reddy: కేసీఆర్ కు అన్నీ ఆ బుద్ధులే వచ్చాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • మజ్లిస్ తో అంటకాగుతూ హిందువులపై వ్యాఖ్యలు చేస్తున్నారు
  • లోక్ సభ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది
  • కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు సహించడంలేదు

లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఘనవిజయం సాధించి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కించుకోవడం కిషన్ రెడ్డి స్థాయిని మరో మెట్టు పెంచింది. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనను సహించడంలేదని అన్నారు.

గత కొంతకాలంగా కేసీఆర్ భాష, ఆలోచన విధానం మారిందని తెలిపారు. చాన్నాళ్లుగా మజ్లిస్ తో దోస్తీ చేస్తున్నందున కేసీఆర్ కు కూడా అన్నీ వాళ్ల బుద్ధులే వచ్చాయని విమర్శించారు. మజ్లిస్ తో అంటకాగుతున్నందునే హిందువులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని కేసీఆర్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు అన్నీ అర్థంచేసుకుంటున్నారు కాబట్టే టీఆర్ఎస్ పై లోక్ సభ ఎన్నికల ద్వారా తమ వ్యతిరేకత ప్రదర్శించారని తెలిపారు. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందనడానికి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 9 సీట్లకే పరిమితం చేయడమే నిదర్శనం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News