Telangana: టీపీసీసీ పదవిపై నాకు ఆశ లేదు.. అంతకంటే పెద్ద బాధ్యతను ప్రజలు అప్పగించారు!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • పీసీసీ చీఫ్ గా తప్పుకోనున్న ఉత్తమ్
  • మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు
  • స్పందించిన భువనగిరి ఎంపీ

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గెలిచిన నేపథ్యంలో ఉత్తమ్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. తాజాగా ఈ వ్యవహారంపై భువనగిరి లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

టీపీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఎంతమాత్రం ఆసక్తి లేదని వెంకటరెడ్డి తెలిపారు. ఉత్తమ్ రాజీనామా విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్ష పదవి కంటే ముఖ్యమైన బాధ్యతలను భువనగిరి ప్రజలు తనకు అప్పగించారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

More Telugu News