TV9: హైదరాబాద్ లో ఓ 'అమ్రిష్ పురి'... 'మోజో' టీవీని కబ్జా చేస్తున్నారు: రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు

  • పోలీసుల సాయంతో టీవీ చానెళ్ల కబ్జా
  • తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు
  • మీడియాతో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్

హైదరాబాద్ లో ఉన్న ఓ అమ్రిష్ పురి, పోలీసుల సాయంతో టీవీ చానళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదయం రెండో రోజు సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, లోనికి వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు. భూములను ఎలా ఆక్రమిస్తున్నారో, ఇక్కడ మీడియాను అలాగే ఆక్రమిస్తున్నారని అన్నారు. తన మిత్రులు కొందరు కష్టపడి 'మోజో' టీవీని పెట్టుకుంటే, సత్ప్రవర్తన లేని పోలీసుల సహకారంతో, తప్పుడు కేసులు పెట్టి యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉచితంగా ఓ టెలివిజన్ చానల్ ను కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ, సత్యాన్ని చంపేయాలని చూస్తున్నారని, టీవీ యాజమాన్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా లాక్కునే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 

More Telugu News