Jagan: విశాఖ ఎయిర్ పోర్టులో బ్యానర్లు చూసి.. క్యాన్సర్ బాధితుడికి సాయం చేసిన ఏపీ సీఎం జగన్

  • బ్యానర్లు చూసి ఆగిపోయిన జగన్
  • ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు
  • సంతోషం వ్యక్తం చేసిన బాధితుడి స్నేహితులు

ఏపీ సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్న ఘటన ఇవాళ విశాఖపట్నంలో చోటుచేసుకుంది. జగన్ శారదాపీఠం సందర్శన కోసం ఈ ఉదయం విశాఖ వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టు వద్ద కొందరు టీనేజర్లు బ్యానర్లతో నిలుచున్నారు. నీరజ్ అనే తమ స్నేహితుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, అతడికి సాయం చేయాలని కోరుతూ బ్యానర్లలో పేర్కొన్నారు. అయితే, జగన్ వైజాగ్ చేరుకున్న సమయంలో ఆ బ్యానర్లను చూడలేదు కానీ, తిరిగి  విజయవాడ వెళ్లిపోయే సమయంలో ఆ బ్యానర్లు చూసి ఆగిపోయారు.

తన కాన్వాయ్ ని ఆపిన జగన్ వాహనం దిగి వెళ్లి ఆ టీనేజర్లతో మాట్లాడారు. నీరజ్ అనే కుర్రాడు కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని చికిత్సకు సాయం చేయాలంటూ వారు సీఎంను కోరారు. స్నేహితుడి పట్ల వారు చూపిస్తున్న తాపత్రయం జగన్ ను కదిలించింది. వెంటనే ఆయన విశాఖ జిల్లా కలెక్టర్ ను పిలిపించి చికిత్సకు అయ్యే ఖర్చును అంచానా వేసి, నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో జగన్ నిర్ణయం పట్ల నీరజ్ స్నేహితులు హర్షధ్వనాలు చేశారు.

More Telugu News