Prudhvi: చిరంజీవి దగ్గర పీఆర్వోగా పనిచేస్తే అక్కడితో ఆగిపోవాల్సిందేనా? పైకి ఎదగకూడదా?: పృథ్వీ

  • కన్నబాబుపై పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన పృథ్వీ
  • పవన్ వ్యాఖ్యలపై కాపు సామాజిక వర్గం చర్చించింది
  • పవన్ రెండు చోట్ల ఓడిపోవడానికి కారణం మితిమీరిన ఆత్మవిశ్వాసమే

సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ ఎన్నికల పరిణామాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ముఖ్యనేత కన్నబాబుపై ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. కన్నబాబు గతంలో చిరంజీవి వద్ద పీఆర్వోగా పనిచేశారని, ఆ అభిమానంతోనే కన్నబాబుకు ప్రజారాజ్యంలో అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి కన్నబాబును తరిమికొట్టండి, తాటతీయండి అని పవన్ వ్యాఖ్యానించడంపై కాపు సామాజిక వర్గంలోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు.

మనోడ్ని మనోడే తిట్టడం ఏంటని తూర్పుగోదావరి ప్రజలు చర్చించుకున్నారని, ఇలాంటివి బయటికి తెలియవని వివరించారు. అయినా, పీఆర్వోగా పనిచేసిన వ్యక్తి అంతటితో ఆగిపోవాల్సిందేనా? రాజకీయాల్లో ఎదగకూడదా? అని ప్రశ్నించారు. ఇక, పవన్ రెండు చోట్ల ఓడిపోవడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణమని విశ్లేషించారు.

More Telugu News