jagan: బాలకృష్ణపై పోటీ చేసిన ఇక్బాల్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌... ఎమ్మెల్సీ ఇస్తానన్న జగన్

  • ప్రత్యేక అభిమానం చాటుకున్న వైసీపీ అధినేత
  • విజయవాడ వైసీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఇక్బాల్‌
  • హిందూపురంలో పోటీ చేయించిన జగన్‌

ప్రముఖ సినీనటుడు బాలకృష్ణపై హిందూపురం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన, మాజీ ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌కు ముఖ్యమంత్రి జగన్‌ ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేసి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు విజయవాడ వైసీపీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఇక్బాల్‌ను జగన్‌ ఏరికోరి హిందూపురం తీసుకువెళ్లి పోటీ చేయించారు. ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరులో ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన  ఇఫ్తార్‌ విందులో మహ్మద్‌ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్లు జగన్‌ సభాముఖంగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

కర్నూల్‌ జిల్లా వాసి అయిన ఇక్బాల్‌ ఐజీగా పదవీ విరమణ చేసిన కొన్ని రోజులకే వైసీపీలో చేరారు. అనంతరం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమితులయ్యారు. అయితే తాను కర్నూల్‌ జిల్లా వాసిని అయినందున అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. దీంతో జగన్‌ హిందూపురం టికెట్‌ ఇచ్చారు. అయితే టికెట్‌ ఇచ్చిన సమయంలోనే ఒక వేళ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ హామీ మేరకే  ఈ ప్రకటన చేశారని  భావిస్తున్నారు.

More Telugu News