doctor: చికిత్స పొందుతున్న రోగిని చితకబాదిన వైద్యుడు!

  • జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో ఘటన
  • విచారణకు ఆదేశించిన మంత్రి
  • తీవ్రంగా పరిగణించిన మానవ హక్కుల సంఘం

ఏమైందో ఏమో కానీ ప్రభుత్వాసుపత్రి వైద్యుడొకరు చికిత్స పొందుతున్న రోగిని బెడ్‌పైనే చావబాదాడు. రోగులు అందరూ చూస్తుండగా బెడ్ వద్దకు వచ్చిన వైద్యుడు రోగి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ (ఎస్ఎంఎస్) మెడికల్ కాలేజీలో జరిగిందీ ఘటన. రోగిపై వైద్యుడు దాడిచేస్తుండగా వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. రోగిపై దాడిచేసిన రెసిడెంట్ వైద్యుడిని సునీల్‌గా గుర్తించారు.

రోగిపై వైద్యుడు ఎందుకు దాడిచేశాడన్న విషయం తెలియరాలేదని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ తెలిపారు. కాగా, రోగిపై వైద్యుడి దాడిని మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 25వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించింది.

More Telugu News