Tamilnadu: కూతురి సాయంతో ప్రియుడి హత్య... చంపుతుంటే మహిళ చిరునవ్వులు!

  • తమిళనాడులో వ్యాపారి హత్య
  • అతనితో సహజీవనం చేస్తున్న మహిళ
  • కుమార్తెను వేధించాడని పగ పెంచుకుని హత్య

ఓ హత్యకేసు విచారణలో భాగంగా చెన్నై పోలీసులు విస్తుపోయే వాస్తవాలను వెలుగుతీశారు. సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ హత్య రికార్డుకాగా, హత్య జరుగుతున్న సమయంలో అతని పక్కనే ఉన్న ఓ మహిళ చిరునవ్వులు చిందిస్తూ ఉండటంతో, ఆమెను విచారించి అసలు నిజాన్ని కక్కించారు. మృతుడితో ఆమె సహజీవనం చేస్తోందని, కుమార్తెతో కలిసి ప్లాన్ చేసి, ఆమె స్నేహితుల సాయంతో అతన్ని చంపించిందని తేల్చారు.

తమిళనాడులోని మధురైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి నటరాజన్‌ నగర్‌ లో ఇళంగోవన్‌ అనే వ్యక్తి ఫైనాన్సియర్‌. పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అతని భార్య మరణించగా, అప్పటికే పెళ్లై అనూహ్య అనే కుమార్తె ఉన్న అభిరామి అనే మహిళ పరిచయం అయింది. ఆపై ఇద్దరూ అక్కడే ఓ ఇంట్లో సహజీవనం ప్రారంభించారు. అనూహ్య హాస్టల్ లో ఉంటూ అప్పుడప్పుడూ తల్లిని చూసేందుకు వచ్చిపోతుండేది. ఈ క్రమంలో అభిరామి ఇంట్లో లేని సమయంలో అనూహ్య వచ్చింది. అప్పటికే ఆమెపై కన్నేసిన ఇళంగోవన్‌, అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ విషయాన్ని అనూహ్య, తన తల్లికి చెప్పింది. ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన అభిరామి, ఇళంగోవన్‌ ఆస్తి, ఫైనాన్స్‌ సంస్థల్లో ఉన్న డబ్బులపై దృష్టి పెట్టింది. సన్నిహితంగా ఉంటూనే మట్టుబెట్టాలని ప్లాన్ చేసింది. అందుకు అనుహ్య స్నేహితుడు బాల మురుగన్, అతడి స్నేహితుడి సహకారాన్ని తీసుకుంది. హత్య రోజు సైతం ఇంట్లోని ఉయ్యాలలో ఆయనతో పాటు ఆనందంగా గడిపింది. ఆపై బాల మురుగన్, మరో ఇద్దరు ఇంట్లోకి దూసుకొచ్చి, ఇళంగోవన్ ను దారుణాతి దారుణంగా అభిరామి కళ్లముందే హత్య చేశారు. తొలుత ఈ హత్య వ్యాపార విభేదాల కారణంగా జరిగి ఉంటుందని పోలీసులు భావించినా, సీసీ కెమెరా రికార్డ్ వారికి అభిరామిపై అనుమానం వచ్చేలా చేసింది.

ఆ సమయంలో ఆమె నవ్వుతూ ఉండటం, వారిని ఎదిరించే ప్రయత్నంగానీ, వారించే ప్రయత్నం కానీ చేయకపోవడంతో ఆమెనే అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశారు. ఆపై అనూహ్యను, బాలమురుగన్ ను, మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.

More Telugu News