Telangana: మరోసారి అధికారుల నిర్వాకం... అందరికీ సున్నా మార్కులే!

  • ఇంటర్ ఫలితాలతో విమర్శల పాలు
  • ఇప్పుడు సాంకేతిక విద్యలోనూ అదే తంతు
  • ప్రాక్టికల్ మార్కులు కలపకుండానే రిజల్ట్స్
  • టాప్ 100 ర్యాంకర్లు కూడా ఫెయిల్

ఇంటర్ బోర్డు ఫలితాల విషయంలో తీవ్ర విమర్శల పాలైన తెలంగాణ అధికారుల తప్పిదాలు మరువకముందే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్టులోనూ ఇటువంటి తప్పే జరిగింది. పాలిటెక్నిక్ డిప్లొమా చివరి ఏడాది పరీక్షరాసిన విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారంటూ ప్రకటించింది. ఈసెట్ లో టాప్ 100 ర్యాంకుల్లో ఉన్నవారు కూడా ఫెయిల్ కావడం గమనార్హం. అన్ని సెమిస్టర్లూ పాసైన వారు, చివరి సెమిస్టర్ లో ఫెయిల్ అయినట్టు ప్రకటించడంతో విద్యార్థులు బోరుమంటున్నారు.

కాగా, ఈసీఈ, ఈఈఈ విద్యార్థులకు చివరి సెమిస్టర్ లో పారిశ్రామిక శిక్షణ ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేయాలి. వీటిని కాలేజీ యాజమాన్యాలే బోర్డ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. కానీ కాలేజీలు నిర్దేశిత తేదీల్లో అప్ లోడ్ చేయడంలో విఫలం కావడంతో ఆ ఆప్షన్ ను బోర్డు తీసివేసింది. ఆపై కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు మార్కులను తమకు పంపించాలని చెప్పగా, కాలేజీలు పంపించాయి. అయితే, వాటిని అధికారులు విద్యార్థుల మార్కులకు కలపలేదు. దీంతోనే ఎంతోమంది ఫెయిల్ అయినట్టు ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. బోర్టు వెంటనే తప్పును సరిదిద్దుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News