jagan: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. జగన్ మావాడే: జేసీ దివాకర్ రెడ్డి

  • పార్టీ మారాలనుకోవడం లేదు
  • జగన్ ను వ్యక్తిగతంగా ద్వేషించలేదు
  • రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేశా

రాజకీయరంగం నుంచి తాను తప్పుకుంటున్నానని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ తమవాడేనని... తాను పార్టీ మారాలని భావించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై గతంలో రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేశానని... వ్యక్తిగతంగా ఎన్నడూ ద్వేషించలేదని చెప్పారు. ఈరోజు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి జేసీ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా తనకు సహకరించిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపానని చెప్పారు.

తన తండ్రి స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని... ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగం నుంచి తప్పుకోవాలని నిర్ణయించానని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి, తనకు మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉండేవని... అయినప్పటికీ ఇద్దరి మధ్య సుహృద్భావం ఉండేదని తెలిపారు. ఎన్నికల సంఘంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

More Telugu News