Maharashtra: చంద్రపూర్‌లో దారుణం.. తల్లి ఒడిలో నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చంపితిన్న పులి

  • మహారాష్ట్రలో దారుణం
  • పులిని వెంబడించినా ఫలితం శూన్యం
  • పొదల్లో కనిపించిన బాలుడి మృతదేహం

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని నోట కరచుకుని తీసుకెళ్లిన పులి చంపి ఊరిబయట పడేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో స్థానికులు వణికిపోతున్నారు. జిల్లాలోని గడబోరికి చెందిన సచిన్ గురునులే ఇంటి ఆవరణలో భార్య, తొమ్మిది నెలల కుమారుడు రాకేశ్‌తో కలిసి నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దాహం వేస్తుండడంతో నీళ్లు తాగేందుకు సచిన్ భార్య ఇంట్లోకి వెళ్లింది.

అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన పులి పసిబాలుడు రాకేశ్‌ను నోట కరచుకుని పరుగులు తీసింది. చిన్నారి ఏడుపు విని తల్లిదండ్రులు గతుక్కుమన్నారు. చుట్టుపక్కల వారిని నిద్రలేపారు. అందరూ కలిసి పులిని వెంబడించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు, అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బాలుడి కోసం గాలిస్తున్న క్రమంలో గ్రామానికి కొంత దూరంలో పొదల్లో సగం తినగా మిగిలిన బాలుడి మృతదేహం కనిపించింది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గొల్లుమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News