Chittoor District: అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టిన కంటైనర్‌ లారీ..తృటిలో తప్పిన ప్రమాదం

  • చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘటన
  • వంతెనపై నుంచి వేలాడడంతో ఆందోళన
  • ప్రాణాపాయం నుంచి బయటపడిన డ్రైవర్‌, సహాయకుడు

అదుపు తప్పిన ఓ కంటైనర్‌ వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి దూసుకుపోయినా అదృష్టవశాత్తు కిందకి పడిపోక పోవడంతో డ్రైవర్‌, అతని సహాయకుడి ప్రాణాలు దక్కాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ వంతెనపై జరిగిన ఈ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి గురైన లారీ రైలింగ్‌ను ఢీకొట్టి కాలువ వైపు దూసుకుపోయి నిలిచిపోయింది. వేలాడుతున్న కంటైనర్‌ను చూసి స్థానికులు ఆందోళన చెందారు. డ్రైవర్‌, సహాయకుడు చాకచక్యంగా వాహనం నుంచి బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది. కాకుంటే ఈ ఘటన వల్ల కుప్పం-పలమనేరు రహదారిలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వంతెనపై నుంచి లారీని తీసి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు.

More Telugu News