TSRTC: తెలంగాణ ఆర్టీసీ బస్సుపై విజయవాడలో దాడి... రూ. 25 వేల నగదును అపహరించిన యువకులు!

  • తమకు దారి ఇవ్వలేదని యువకుల ఆగ్రహం
  • బస్సు ఆద్దాలను ధ్వంసం చేసిన యువకులు
  • కొందరి అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు

తమ ద్విచక్ర వాహనాలకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో విజయవాడకు చెందిన కొందరు యువకులు తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడికి దిగడంతో పాటు, డ్రైవర్ వద్ద ఉన్న టిమ్ మెషీన్ ను, రూ. 25 వేల నగదును అపహరించుకుపోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నార్కట్ పల్లి డిపోకు చెందిన బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న వేళ ఈ ఘటన జరిగింది.

తమకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో కొందరు యువకులు, తమ సామాజిక వర్గం వారిని పిలిపించి, భవానీపురం వద్ద బస్సును అడ్డుకున్నారు. దాదాపు 50 మంది యువకులు బస్సుపై దాడికి దిగి, అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్ ను కొట్టారు. అతని వద్ద ఉన్న డబ్బును దోచుకున్నారు. టికెట్లను కొట్టే టిమ్ మెషీన్ ను లాక్కెళ్లారు. డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, కొందరిని గుర్తించి, అరెస్ట్ చేశారు. బస్సుపై దాడి చేసిన మిగతావారి కోసం గాలిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.

More Telugu News