Father: కూతురి మరణాన్ని తట్టుకోలేక... గంటలోపే ఆగిన తండ్రి గుండె!

  • జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ కు బాల్ రాజు
  • బెంగ పెట్టుకున్న బిడ్డకు తీవ్ర అనారోగ్యం
  • బిడ్డ మృతిని తట్టుకోలేక మరణించిన తండ్రి

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె మరణించిన గంట వ్యవధిలోనే ఆ తండ్రి గుండె ఆగింది. ఈ ఘటనతో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ కు చెందిన ఇమ్మడి బాల్‌ రాజు (35)కు భార్య సరిత, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లావణ్య (11)ను కంటికి రెప్పలా సాకాడు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ కు తండ్రి వెళ్లగా, బెంగ పెట్టుకున్న లావణ్య తీవ్ర అనారోగ్యానికి గురైంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్ రాజు, శుక్రవారం నాడు గ్రామానికి వచ్చాడు. కుమార్తెను చూసి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. అయినా ఫలితం దక్కక ఆమె మరణించింది. లావణ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కాసేపటికే బాల్ రాజు గుండెపోటుతో కుప్పకూలాడు. బిడ్డ మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆయన, గంట వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రమైంది. యూత్ కాంగ్రెస్, అంబేద్కర్ యువజన సంఘం తదితరాల్లో చురుకుగా ఉండే బాల్ రాజు మృతిపట్ల  అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంతాపాన్ని వెలిబుచ్చారు.

More Telugu News