Tamil Nadu: ఇక సచివాలయ ఉద్యోగులకూ డ్రెస్ కోడ్.. ఉత్తర్వులు జారీ చేసిన తమిళ సర్కార్!

  • మహిళా ఉద్యోగులు చీర, దుపట్టా ఉన్న చుడీదార్ ధరించొచ్చు
  • పురుషులు ఫార్మల్ చొక్కాలు, ప్యాంట్లు మాత్రమే ధరించాలి
  • తమిళ సంప్రదాయ పరిరక్షణకే ఈ డ్రెస్‌కోడ్

డ్రెస్‌కోడ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరిది. దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఆలయానికి రావాలని భక్తులను కోరుతున్నాయి. దేవుని సన్నిధిలో పాశ్చాత్య వస్త్రధారణ తగదని హితవు పలుకుతున్నాయి. ఇప్పుడు ఇదే బాటను అనుసరిస్తోంది తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది.

మహిళలు చీర, లేదంటే దుపట్టాతో ఉన్న చుడీదార్, సల్వార్ కమీజ్ ధరించి కార్యాలయానికి రావాలని, పురుషులు ఫార్మల్ చొక్కాలు, ఫార్మల్ ప్యాంట్లు మాత్రమే ధరించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయ మర్యాదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు డ్రెస్‌కోడ్‌ను పాటించాలని అందులో కోరారు.

కోర్టులు, ట్రైబ్యునల్‌, న్యాయ కమిటీ ఎదుట హాజరయ్యే పురుష ఉద్యోగులు తప్పనిసరిగా ట్రౌజర్లు, కోటు ధరించాలని, మహిళా ఉద్యోగులైతే చీర, దుపట్టాతో ఉన్న చుడీదార్ ధరించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమిళ సంప్రదాయ పరిరక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఫార్మల్‌గా కనిపించడం వల్ల ప్రజలు కూడా గౌరవిస్తారని పేర్కొన్నారు. 

More Telugu News