Uttar Pradesh: యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం.. మంత్రివర్గ సమావేశాల్లో ఫోన్ల వాడకంపై నిషేధం!

  • సమావేశాల్లో వాట్సాప్ చూస్తూ గడిపేస్తున్న మంత్రులు
  • సమావేశంపై దృష్టి సారించడంలో విఫలం
  • ఇకపై మొబైల్స్ బయట డిపాజిట్ చేసి లోపలికి రావాలంటూ ప్రభుత్వం ఆదేశం

కీలకమైన మంత్రివర్గ సమావేశాల్లో మంత్రులు మొబైల్స్ చూస్తూ వాట్సాప్‌లలో మునిగిపోతున్నారని, ఫలితంగా సమావేశంపై దృష్టి సారించడం లేదని భావిస్తున్న యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మంత్రివర్గ సమావేశాల్లో మంత్రులు ఎవరూ మొబైల్స్ వాడకూడదంటూ నిషేధం విధించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు మొబైల్స్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టి తీసుకొచ్చేందుకు మంత్రులకు అనుమతి ఉండేది. అయినప్పటికీ వాట్సాప్ మెసేజ్‌లను చదవడంలో, పంపడంలో అమాత్యులు మునిగిపోతున్నారని, ఫలితంగా సమావేశాల్లో వారి ఏకాగ్రత దెబ్బతింటోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావించారు.

ఇకపై జరిగే సమావేశాలకు మంత్రులు ముందుగా తమ ఫోన్లను డిపాజిట్ చేసి రావాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇలా చేయడం వల్ల సమావేశాల్లోని కీలక నిర్ణయాలను హ్యాక్ చేయడానికి కానీ, ఎలక్ట్రానిక్ గూఢచర్యం నుంచి ముప్పు కానీ ఉండదని ప్రభుత్వం పేర్కొంది.

More Telugu News