Andhra Pradesh: తూర్పుగోదావరిలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, స్కూలులోని చెక్కపెట్టెలో పెట్టిన దుండగులు!

  • జిల్లాలోని చెన్నయ్యపాలెంలో ఘటన
  • స్కూల్ లో దుర్గంధం.. పోలీసులకు సమాచారం
  • వారంరోజుల క్రితం మాయమైన అబ్బాయిలు

  తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం కనిపించకుండాపోయిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు పాఠశాల గదిలో శవాలుగా తేలారు. ఈ ఘటన జిల్లాలో చెన్నయ్యపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. చెన్నయ్యపాలెంకు చెందిన కార్తీక్, ప్రశాంత్ వారం రోజుల క్రితం కనిపించకుండాపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లల కోసం గాలింపు చేపట్టారు.

అయితే ఎంత వెతికినా పిల్లలజాడ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఊరిచెరువు దగ్గరున్న పాఠశాలలో ఈరోజు దుర్గంధం రావడం ప్రారంభమైంది. దీంతో రైతులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు స్కూల్ లోని ఓ చెక్క పెట్టెను తెరిచిచూడగా, ఇద్దరు పిల్లల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. వీరిని తప్పిపోయిన కార్తీక్, ప్రశాంత్ లుగా గుర్తించారు. ఎవరో వీరిని చంపేసి చెక్కపెట్టెలో పెట్టినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News