Rajasthan: 2,500 టన్నుల ఉక్కు, 351 అడుగుల ఎత్తు... ప్రపంచంలోనే అతిపెద్ద పరమశివుడు!

  • రాజస్థాన్ లోని గణేశ్ టేక్రీలో విగ్రహం
  • 2013లో నిర్మాణ పనులు మొదలు
  • ఆగస్టుతో పూర్తి కానున్న నిర్మాణం

నర్మదా నది తీరంలో భారీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరువాత, మరో భారీ విగ్రహం తయారవుతోంది. రాజస్థాన్ లోని గణేశ్ టేక్రీ సమీపంలోని నాథ్ ద్వారా వద్ద పరమశివుని అత్యంత భారీ విగ్రహం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆవిష్కరణ తరువాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం కానుంది. ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని విగ్రహ ఏర్పాటు కమిటీ చెబుతోంది. విగ్రహ నిర్మాణానికి మొత్తం 2,500 టన్నుల ఉక్కును వాడుతుండగా, దీని ఎత్తు 351 అడుగులు ఉంటుంది. మూడు వ్యూ గ్యాలరీలు 20 అడుగుల ఎత్తులో, 110 అడుగుల ఎత్తులో, 270 అడుగుల ఎత్తులో ఉంటాయి. అక్కడికి చేరుకునేందుకు లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ నిర్మాణం మిరాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతుండగా, ఉక్కుతో పాటు హై క్వాలిటీ కాపర్, జింక్ లను కూడా వాడుతున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ విగ్రహం ప్రపంచంలోని అన్ని విగ్రహాల్లో నాలుగో అతిపెద్దది అవుతుందని 'దైనిక్ భాస్కర్' వెల్లడించింది. 2013 ఏప్రిల్ 17న విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించామని మిరాజ్ గ్రూప్ పేర్కొంది.

ఇక ట్విట్టర్ లో సంస్థ విడుదల చేసిన ఫొటోలను పరిశీలిస్తే, విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. శివుని తలకు పెయింటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం విగ్రహం మెడ నుంచి కింది భాగం వరకూ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ విగ్రహం ముందు కొలువుదీరనున్న భారీ నంది 37 అడుగుల పొడవుతో, 25 అడుగుల ఎత్తుతో ఉండనుందట.




More Telugu News