Hyderabad: యువతి నగ్న చిత్రాలు తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకులు!

  • భర్తతో విభేదాల కారణంగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్న యువతి
  • కన్నేసి లొంగదీసుకునే యత్నం
  • నగ్న ఫొటోలు తీసి బాధితురాలికి సోదరుడికి పంపిన నిందితులు

ఇంటిపక్కన ఒంటరిగా వుండే యువతిపై కన్నేసిన ఇద్దరు యువకులు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ చేశారు. ఇంటికి విందుకు పిలిచి ఉద్దేశపూర్వకంగా ఆమె దుస్తులపై పండ్ల రసం పడేశారు. ఆపై దుస్తులు మార్చుకోవాలంటూ గదిలోకి పంపి ఫొటోలు, వీడియోలు తీశారు. ఆపై వాటిని ఆమెకు చూపించి బెదిరింపులకు దిగారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిందీ ఘటన.

సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ వివాహిత భర్తతో విభేదాల కారణంగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. విషయం తెలిసిన ఇద్దరు యువకులు ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ఇంటి పక్కనే ఉండే మరో యువతి ద్వారా తమ ప్లాన్‌ను అమలు చేశారు. బాధితురాలి పక్కింటివారు ఏదో ఫంక్షన్ చేస్తున్నారని తెలిసిన నిందితులు తమ ప్లాన్‌ను అమలు చేశారు. విందుకు ఆమెను కూడా ఆహ్వానించేలా చేశారు.

అయిష్టంగానే విందుకు వచ్చిన బాధిత యువతి భోజనం పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమె చుట్టూనే తిరుగుతున్న నిందితులు ఇద్దరూ ఉద్దేశపూర్వకంగా ఆమె దుస్తులపై పండ్ల రసాన్ని పడేశారు. అనంతరం దుస్తులు మార్చుకోవాలంటూ ఓ గదిలోకి పంపించారు. అక్కడ ఆమె దుస్తులు మార్చుకుంటుంటే రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. మంగళవారం సాయంత్రం బాధితురాలి సోదరుడికి నిందితులు ఆమె నగ్న చిత్రాలను పంపించారు. వీటిని చూసిన ఆమె షాక్‌కు గురైంది. ఆ వెంటనే సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల సెల్‌ఫోన్ ఆఫ్ చేసి ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు.

More Telugu News