Andhra Pradesh: ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి వెళ్లలేకపోయిన ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్!

  • మధ్యాహ్నం 3.30లోపు రావాలని సమాచారం
  • విజయవాడలోనే ఆలస్యం
  • పర్యటనను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రులు

ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణస్వీకారం అనంతరం కార్యక్రమాలు ఆలస్యం కావడంతో జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో కలిసి హాజరుకావాలని జగన్, కేసీఆర్ లు నిర్ణయించుకున్నారు.

అయితే మోదీ ప్రమాణస్వీకారానికి దేశవిదేశాల నుంచి అతిథులు వస్తున్నారనీ, కాబట్టి ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోయిందని పౌరవిమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు తెలిపారు. ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకే ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే విజయవాడలోనే సమయం 3 గంటలు అయిపోవడంతో జగన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనను రద్దుచేసుకున్నట్లు సమాచారం.

More Telugu News