Balakrishna: పటిష్టమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా పోరాడుతాం: బాలకృష్ణ

  • మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ
  • అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్
  • కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన బాలకృష్ణ 

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. తాజా ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడం పట్ల నిరాశ చెందవద్దని, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

అభిమానంతో తనను మళ్లీ గెలిపించిన హిందూపురం నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని బాలకృష్ణ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు ఎందుకు ప్రభావితం కాలేదో ఆలోచిస్తామని అన్నారు. పటిష్టమైన ఒక ప్రతిపక్షంగా అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా పోరాడుతామని ఈ సందర్భంగా బాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని బాలకృష్ణ వ్యక్తం చేశారు.

More Telugu News