Ex-president: మాజీ రాష్ట్రపతిని కలిసిన మోదీ.. స్వీటు తినిపించిన ప్రణబ్

  • ప్రణబ్ నివాసానికి వెళ్లిన మోదీ
  • సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు చెప్పిన ప్రణబ్
  • ప్రణబ్ పై ప్రశంసలు కురిపించిన మోదీ

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ ఢంకా మోగించడంతో మళ్లీ ప్రధాని పీఠంపై కూర్చునేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని, బీజేపీ సీనియర్ నేతలను మోదీ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి విదితమే.  

తాజాగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మోదీ కలిశారు. ప్రణబ్ నివాసానికి ఈరోజు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా మోదీని సాదరంగా ఆయన ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు మోదీకి శుభాకాంక్షలు చెప్పిన ప్రణబ్, స్వయంగా మోదీకి ఆయనే స్వీట్ తినిపించారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రణబ్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రణబ్ దాదాను కలవడం ప్రతిసారి ఓ మహోన్నత అనుభవాన్ని ఇస్తుందని, ఆయన పరిజ్ఞానం, ప్రావీణ్యం అసమానమని కొనియాడారు. ఈ దేశానికి ఎంతో సేవ చేసిన ప్రణబ్ గొప్ప రాజనీతజ్ఞుడని, ఈరోజు ఆయన్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని మోదీ పేర్కొన్నారు.

More Telugu News