Andhra Pradesh: ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే!: మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

  • 2014లో రాగానే సంపాదనపై బాబు దృష్టి పెట్టారు
  • అప్పుడే అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది
  • ప్రాజెక్టు అంచనాలను కూడా అమాంతం పెంచేశారు

ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘనవిజయం సాధించడానికి, టీడీపీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. తాను 20 నెలల పాటు ఏపీ ప్రభుత్వంలో పనిచేశాననీ, అప్పుడే చంద్రబాబు 2019లో గెలవకపోవచ్చు అన్న అభిప్రాయం కలిగిందని వెల్లడించారు. చంద్రబాబు 2014లో గెలిచినప్పటి నుంచి 2019 ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు కావాలని భావించారు. అందుకు అనుగుణంగా సంపాదనపై దృష్టి పెట్టారు. దీంతో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని ప్రజలు భరించలేకపోయారు’ అని పేర్కొన్నారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐవైఆర్ మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు విపరీతంగా పెంచేయడంతో పాటు ప్రభుత్వ భూములను సూట్ కేస్ కంపెనీలకు కేటాయించారని ఐవైఆర్ తెలిపారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీల జోక్యం కారణంగా అనర్హులు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. ‘అర్హులకు లబ్ధి జరగకపోవడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది.

ఏపీ అంతటినీ అభివృద్ధి చేయకుండా ఓ ప్రాంతంపైనే దృష్టి సారించారు. అందుకే రాయలసీమలో 3 సీట్లు వచ్చాయి. ఇక సామాజికవర్గం ప్రకారం ఓ వర్గం వారే లాభపడుతున్నారు. మిగతావారికి ప్రయోజనాలు దక్కడం లేదు అన్న భావం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. చంద్రబాబు బాగానే ఉన్నప్పటికీ ఆయన చుట్టుపక్కల ఉన్నవారు చాలా అహంభావంతో వ్యవహరించారు. ఈ కారణాల వల్లే టీడీపీ ఘోర పరాజయం పాలైంది’ అని పేర్కొన్నారు. 

More Telugu News