Andhra Pradesh: ఏపీలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి.. కక్షసాధింపు చర్యలు సరికాదు!: డొక్కా మాణిక్యవరప్రసాద్

  • ఓటమికి టీడీపీ నేతలంతా బాధ్యత వహిస్తున్నాం
  • ఎన్నికల్లో గెలుపోటములు సహజం
  • దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోండి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి టీడీపీ నేతలంతా బాధ్యత వహిస్తున్నామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. ఏపీలో చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే అభివృద్ధి ఉరకలేస్తుందని వ్యాఖ్యానించారు. గురజాల కేంద్రంగా పల్నాడును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమనీ, పార్టీ శ్రేణులు నిరాశ చెందవద్దని సూచించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలను తాము ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని వాపోయారు.విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు సరికాదని వ్యాఖ్యానించారు. ఈ తరహా దాడులు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని డొక్కా అన్నారు. కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తామనీ, అవినీతికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తే వ్యక్తిగతంగా సహకరిస్తామని స్పష్టం చేశారు. 

More Telugu News