Undavalli: జగన్ లో వైఎస్ స్పష్టంగా కనిపిస్తున్నారు: ఉండవల్లి అరుణ్ కుమార్

  • ఎన్టీఆర్ విజయం కన్నా జగన్ దే పెద్ద విజయం
  • జగన్ కు నా ప్రత్యేక అభినందనలు
  • రాజమండ్రిలో మీడియాతో ఉండవల్లి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు విడిపోయిన తరువాత కూడా ఎవరూ సాధించలేనంతటి ఘన విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు చేసిన వైఎస్ జగన్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్ ఘన విజయాన్ని సాధించిన వేళ కూడా ఆయన ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగారని, జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారని గుర్తు చేశారు.

నిన్న ఢిల్లీలో ప్రధానితో చర్చించి వచ్చిన తరువాత జగన్, మీడియాతో మాట్లాడిన వేళ తాను చూశానని, తనకు జగన్ లో వైఎస్ స్పష్టంగా కనిపించారని అన్నారు. మనసులోని మాటను బయటకు చెప్పేసే వైఎస్ నైజమే జగన్ లో కనిపించిందని ఉండవల్లి తెలిపారు. మోదీని కలిసి వచ్చిన తరువాత, ఆయనకు పూర్తి మెజారిటీ రాకూడదని కోరుకున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆ మాటలు చాలా మంచి గుణానికి సంకేతమని, జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే మంచి జరుగుతుందని అన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పడం, పారదర్శకతను పెంచుతానని అనడం, జగన్ లోని పట్టుదలకు సంకేతమని అభిప్రాయపడ్డారు.

More Telugu News