Andhra Pradesh: రాప్తాడులో పరిటాల శ్రీరామ్ అందుకే ఓడిపోయాడు!: వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

  • టీడీపీ నేతలు తాగునీరు, సాగునీరు  అందించలేకపోయారు
  • సునీత కారణంగా 25 వేల మంది వలస వెళ్లారు
  • మీడియాతో మాట్లాడిన రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే

అనంతపురం జిల్లాలోని రాప్తాడుకు సాగునీరు, తాగునీరు అందించడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ప్రజలు రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ను చిత్తుచిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు. మంత్రి పరిటాల సునీత నిర్లక్ష్యం కారణంగా ఉపాధి కోసం 25,000 మంది జిల్లా వాసులు వలస వెళ్లిపోయారనీ, బెంగళూరులోని మురికి వాడల్లో బతుకుతున్నారని విమర్శించారు. రాప్తాడు ప్రజలు పరిటాల కుటుంబం పేరును మర్చిపోయేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతపురంలో ఈరోజు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రెడ్డి మాట్లాడారు.

రాప్తాడులో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, యువతకు ఉపాధి కల్పిస్తామని  హామీ ఇచ్చారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకు పెద్దగా ఏమీ చేయలేకపోయారనీ, ఆమెకు ఎలాంటి విజన్ లేకపోవడమే అందుకు కారణమని వ్యాఖ్యానించారు. సునీత చుట్టూ ఉన్న అనుచరులు కూడా ఆమెను సరిగ్గా గైడ్ చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 1.26 లక్షల ఎకరాలకు సాగునీటి హక్కు ఉందనీ, వీటిలో ఒక్క ఎకరాకు సునీత నీళ్లు తీసుకురాలేకపోయారని విమర్శించారు.

 కనీసం పిల్లకాలువలను పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. పరిటాల విఫలమైన చోట్ల తాను సక్సెస్ అవుతానని ధీమా వ్యక్తం చేశారు. తన కోరిక మేరకే అనంతపురంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. అండగా ఉంటాననే తనకు ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. చంద్రబాబు ఇష్టానుసారం ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారనీ, అలాంటిది చంద్రబాబును మళ్లీ గెలిపించడానికి ప్రజలు ఏమైనా పిచ్చివాళ్లా? అని ప్రశ్నించారు

More Telugu News