Krishna District: తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందని మనస్తాపంతో అభిమాని మృతి

  • ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఆందోళన
  • మంచానికే పరిమితమై భోజనం కూడా చేయక ఆసుపత్రి పాలు
  • గుండె నొప్పి రావడంతో చికిత్స పొందుతూ మృతి

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందన్న మనస్తాపంతో ఓ అభిమాని గుండె పోటుకు గురై మృతి చెందాడు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన పీతా మధుసూదన రావు (53) తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి. సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఊహించాడు. అతని ఊహలు తారుమారయ్యాయి.

ఈనెల 23న ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. మరునాడు గుండెలో నొప్పి వస్తోందంటే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధుసూదనరావు మృతదేహాన్ని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి నివాళులర్పించారు.  మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, నాయకులను కోరారు.

More Telugu News