Chandrababu: ఇంత చేసినా ఓటమా?... జీర్ణించుకోలేకున్నా: నెల్లూరు నేతలతో చంద్రబాబు!

  • చంద్రబాబును కలిసిన పలువురు నేతలు
  • పరాజయానికి కారణాలపై చర్చ
  • సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో విఫలం
  • అభిప్రాయపడ్డ పార్టీ సీనియర్ నేతలు

నెల్లూరు జిల్లాకు తానెంతో చేశానని, అయినప్పటికీ, ఇంత ఘోర పరాజయం ఎదురు కావడాన్ని తట్టుకోలేకున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఉండవల్లిలోని తన నివాసంలోనే ఉంటూ, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతున్న చంద్రబాబును, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పీ నారాయణ తదితరులు కలిశారు.

ఈ సమయంలో పార్టీ పరాజయానికి గల కారణాలు చర్చకు రాగా, బలహీనవర్గాలకు వేల గృహాలు నిర్మించామని, అయినా నెల్లూరు చుట్టుపక్కలా ఓడిపోయామని, దీన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. వేల ఇళ్లు నిర్మించినా, సకాలంలో వాటిని పేదలకు అందించలేకపోయామని, జనసేన ప్రభావం చూపిందని, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసినా, వాటిపై ప్రచారం చేసుకోవడంలో విఫలం అయ్యామని నేతలు వ్యాఖ్యానించారు.

కాగా, చంద్రబాబుతో సమావేశమైన వారిలో  పార్టీ సీనియర్‌ నాయకులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు ఉన్నారు. 28న ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని గుంటూరులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా పార్టీ నిర్ణయించింది

More Telugu News