Hyderabad: 'మహర్షి' ప్రదర్శిస్తుండగా బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్!

  • మల్కాజ్ గిరిలో సాయిరాం థియేటర్ కు కాల్
  • వెంటనే పోలీసులకు సమాచారం
  • ఆకతాయి పనిగా నిర్దారించిన పోలీసులు

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో ఉన్న సాయిరాం థియేటర్ లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్ రావడంతో థియేటర్ యాజమాన్యం, పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. శనివారం నాడు ఈ థియేటర్ లో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి' ప్రదర్శితమవుతుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. థియేటర్ లో బాంబు పెట్టామని, అది మరికాసేపట్లో పేలుతుందని ఆ కాల్ సమాచారం. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అక్కడకు చేరుకున్న పోలీసులు, సినిమా ప్రదర్శనను నిలిపివేసి, థియేటర్ మొత్తాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఏ విధమైన బాంబు లేదని తేల్చారు. ఇదేదో ఆకతాయి పనిగా భావిస్తున్నామని, ఫోన్ నంబర్ ఆధారంగా తప్పుడు కాల్ చేసిన నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు. ఈ ఫోన్ కాల్, ఆపై జరిగిన పరిణామాలతో మల్కాజ్ గిరిలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

More Telugu News