Thief: పెళ్లి కోసం డ్రా చేసిన డబ్బులు.. బస్సెక్కుతుంటే మాయం!

  • బంధువుల పెళ్లి కోసం లక్ష రూపాయలు డ్రా
  • జేబులో పెట్టుకుని బస్సెక్కుతుండగా చోరీ
  • సీసీటీవీ ఫుటేజీలో కనిపించని దొంగ ఆచూకీ

పెళ్లి ఖర్చుల కోసం డ్రా చేసిన లక్ష రూపాయలు పట్టుకుని బస్సెక్కుతుండగా చోరీకి గురైన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలంలోని అంతిరెడ్డి‌గూడకు చెందిన శేఖర్-అనురాధ భార్యభర్తలు. తమ బంధువుల ఇంట్లో పెళ్లి కోసం శుక్రవారం చేవెళ్లలోని ఓ బ్యాంకు నుంచి లక్ష రూపాయలు డ్రా చేశారు.

అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో డబ్బులు ప్యాంటు జేబులో పెట్టుకుని బస్టాండుకు చేరుకున్నారు. ఈ క్రమంలో బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి శేఖర్ జేబులోని లక్ష రూపాయలను అపహరించి పరారయ్యాడు. దీంతో లబోదిబోమన్న శేఖర్ విషయాన్ని బంధువులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్టాండుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినప్పటికీ ఎటువంటి వివరాలు లభ్యం కాకపోవడంతో, నిందితుడికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.  

More Telugu News