Jagan: 30న ప్రమాణం చేసేది జగన్ ఒక్కరే.. జూన్ తొలి వారంలో మరో 20 మంది!

  • వైసీపీలో పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
  • జూన్ తొలి వారంలో మంత్రి వర్గంలోకి 20 మంది
  • జగన్‌ను కలిసిన ఆశావహులు

ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో నేడు సమావేశం కానున్న జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించనున్నారు.

కాగా, 30న విజయవాడలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఆ రోజు మంత్రులెవరూ ప్రమాణం చేయరని, జూన్ తొలివారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాల సమాచారం. ఇక, ఈ ఎన్నికల్లో హేమాహేమీలను ఓడించిన వైసీపీ అభ్యర్థులు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆశావహుల్లో చాలామంది శుక్రవారం తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్‌ను కలిశారు.

కాగా, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, కొడాలి నాని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆర్కే రోజా, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులకు మంత్రి పదవులు పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.

More Telugu News