Shamshabad: కూలికి వెళ్లే విషయంలో గొడవ.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త

  • శంషాబాద్‌లో ఘటన
  • భార్యతో గొడవతో భర్త మనస్తాపం
  • భర్త పరిస్థితి విషమం

కూలి పనికి వెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  వనపర్తి జిల్లా చెలిమిల్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చి ఎయిర్‌పోర్టు కాలనీలో నివసిస్తున్నాడు. ఇద్దరూ కూలిపనులు చేస్తూ జీవిస్తున్నారు. కూలికి వెళ్లే విషయంలో ఈ నెల 22న ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది క్రమంగా ముదిరి తీవ్ర ఘర్షణగా మారింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన  శ్రీనివాసులు ఇంట్లోని కిరోసిన్‌ను తీసుకుని తన ఒంటిపై పోసుకున్నాడు. అనంతరం అగ్గిపెట్టె కోసం వెతుకుతుండగా భార్య భయంతో పరుగులు తీసింది. ఈ లోగా శ్రీనివాస్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన శ్రీనివాసులును వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News