shabana azmi: మోదీకి శుభాకాంక్షలు చెప్పిన నటి షబానా ఆజ్మీ.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!

  • మోదీ గెలిచి పీఎం అయితే దేశం విడిచి పాక్ వెళ్లిపోతానన్న నటి
  • ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
  • ఎప్పుడు వెళ్లిపోతున్నారో చెప్పాలంటూ ప్రశ్నలు

మోదీ మరోమారు గెలిచి ప్రధాని అయితే తాను దేశం విడిచి పాక్ వెళ్లిపోతానంటూ బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో వెనక్కి తగ్గిన షబానా.. తాను ఈ గడ్డపైనే పుట్టానని, తుదిశ్వాస వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మరోమారు ఘన విజయం కట్టబెట్టారు. దీంతో స్పందించిన షబానా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రజలు బలమైన తీర్పు ఇచ్చారని, మోదీకి, ఎన్డీయేకు అభినందనలని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

షబానా ట్వీట్‌ను చూసిన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె చేసిన ‘పాకిస్థాన్’ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తమరు ఎప్పుడు దయచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరో ఐదేళ్ల వరకు మోదీయే ప్రధాని అని, ఈ విషయాన్ని మీ భర్త, కుమారుడితో చెప్పాలని సూచిస్తున్నారు. ఈ రాత్రికి కూడా పాకిస్థాన్ వెళ్లేందుకు రైలు ఉందంటూ కొందరు ట్వీట్ చేశారు. శుభాకాంక్షలు చెప్పడం వరకు బాగానే ఉందని కానీ, మీరు పాకిస్థాన్ వెళ్లేది ఎప్పుడో చెప్పలేదంటూ మరో యూజర్ వేళాకోళం చేశాడు.

More Telugu News