Prashant Kishore: జగన్ ఘన విజయం తరువాత... ప్రశాంత్ కిశోర్ ముందు పార్టీల క్యూ!

  • జగన్ విజయం వెనుక పీకే కృషి
  • రెండేళ్ల నుంచి వైసీపీ వెంటే
  • ఘన విజయంతో అందరి చూపూ ఆయన వైపే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... వచ్చే రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సివున్న పార్టీల అధినేతల చూపు ఇప్పుడు ఆయనపైనే ఉంది. ఆయన తమ వెంట నడిస్తే, విజయం సులువవుతుందని భావిస్తున్న నేతలు ఇప్పుడాయన ముందు క్యూ కడుతున్నారు. 2014లో బీజేపీ విజయానికి బాటలు వేయడంతో పాటు, ఆపై బీహార్ లో బీజేపీకి ఎదురు నిలిచి లాలూ, నితీశ్ ల మహాకూటమి ఘనవిజయానికి తనవంతు సాయం చేసిన ప్రశాంత్ కిశోర్, తాజాగా జగన్ వెన్నంటి నిలిచి, వైసీపీ ఘన విజయానికి కృషి చేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడిని అధికారానికి దూరం చేయడంలో పీకే టీమ్ పాత్ర కూడా చాలానే ఉందనడంలో సందేహం లేదు.

ఇక ఏపీలో జగన్ విజయం తరువాత తమ వద్దకు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గడచిన రెండు సంవత్సరాలుగా తమ టీమ్ జగన్ రెడ్డి కోసం పని చేసిందని గుర్తు చేశారు. గత వారంలో ప్రశాంత్ కిశోర్ తండ్రి మరణించడంతో ఆయన కొంత దిగులుగా ఉన్నారని, కోలుకున్న తరువాత తదుపరి ప్రణాళికల గురించి ఆయనే నిర్ణయిస్తారని తెలిపాయి.

More Telugu News