Prakash Raj: లాగిపెట్టి చెంప చెళ్లుమనిపించినట్టుంది: ప్రకాశ్ రాజ్

  • సహకరించినవారికి కృతజ్ఞతలు
  • ఇకపైనా పోరాటం కొనసాగుతుంది
  • ట్వీట్ చేసిన నటుడు

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో దారుణ వైఫల్యం చవిచూసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన పరిస్థితి పట్ల స్పందించారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. అయితే, కౌంటింగ్ కొనసాగేకొద్దీ ఆయన గ్రాఫ్ పడిపోయింది. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ కేవలం 2.3 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన ప్రత్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ 49.3 శాతం, బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ 45.6 శాతం ఓట్లతో ఎంతో ముందు నిలిచారు.  ఈ నేపథ్యంలో, ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు.

ఈ ఫలితాలు చూస్తుంటే గట్టిగా లాగిపెట్టి చెంప చెళ్లుమనిపించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. "ఎన్నో దూషణలు, తిట్ల పర్వాలు, విమర్శలు, వేధింపులు చవిచూశాను. అయితే ఎప్పుడూ ఇలాగే ఉంటాను. లౌకికవాద భారతదేశం కోసం నా పోరాటం ఇకపైనా కొనసాగుతోంది. కఠిన ప్రయాణం ఇప్పుడే మొదలైందనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

More Telugu News