India: ఓట్ల లెక్కింపు రోజున వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలే... వినోద ప్రధాన చానళ్లకు కేంద్రం హెచ్చరిక

  • నాన్-న్యూస్ చానళ్లు వినోద కంటెంట్ నే ప్రసారం చేయాలి
  • ఎన్నికల కంటెంట్ ప్రసారంపై అనుమతి లేదు
  • న్యూస్ చానళ్లకు మాత్రమే ఎన్నికల కంటెంట్ పై అనుమతి

ఇప్పటికే వినోద ప్రధాన చానళ్లపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నా, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కేంద్రం మరోసారి హెచ్చరిక జారీచేసింది. నాన్-న్యూస్ చానళ్ల కేటగిరీలో ఉన్న టీవీ చానళ్లు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కంటెంట్ ను ప్రసారం చేయరాదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అమిత్ కాటోచ్ ఈ మేరకు ప్రయివేటు రంగంలో ఉన్న అన్ని వినోద ప్రధానమైన చానళ్లకు ఆదేశాలు జారీచేశారు.

కేవలం న్యూస్ చానల్ కేటగిరీలో రిజిస్టర్ అయిన చానళ్లు మాత్రమే వార్తలు ప్రసారం చేసుకోవచ్చని, నాన్-న్యూస్ చానల్ కేటగిరీలో రిజిస్టర్ అయిన చానళ్లు కేవలం వినోద సంబంధిత కార్యక్రమాలనే ప్రసారం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

సాధారణంగా టీవీ చానళ్లకు అనుమతులు మంజూరు చేసే సమయంలో రెండు కేటగిరీలుగా విభజిస్తారు. ఒకటి నాన్-న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ కాగా, రెండోది న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్. మొదటిది ఎంటర్టయిన్ మెంట్ కిందకు వస్తుంది. రెండోది వార్తా ప్రసారాల కిందకు వస్తుంది.

More Telugu News