Azamkhan: జయప్రద గెలిస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేసినట్టే: ఆజంఖాన్

  • తనకు 3 లక్షల మెజారిటీ ఖాయమన్న ఆజంఖాన్
  • మెజారిటీ రాకుంటే ఈవీఎంల ట్యాంపరింగే
  • రాంపూర్ సమాజ్ వాదీ అభ్యర్థి ఆజంఖాన్

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గంలో తాను గెలవకుంటే ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేసినట్టేనని సమాజ్ వాదీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. తనకు మూడు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ ఖాయమని, అంత మెజారిటీ రాకున్నా ఈవీఎంలలో లోపాలున్నట్టేనని భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగినట్టుగా తనకు అనిపించడం లేదన్న ఆజంఖాన్, ఈ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా నిలబడ్డ జయప్రద ఓటమి ఖాయమన్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న వేళ, ఆజంఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గతంలో సమాజ్ వాదీ పార్టీలో ఉండి, రాంపూర్ నుంచే ఎంపీగా విజయం సాధించిన జయప్రద, ఈ సంవత్సరం ఏప్రిల్ లో బీజేపీలో చేరగా, ఆమెనే తమ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రదపై పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్, తరువాత తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

More Telugu News