thulasi reddy: కార్పొరేట్ సంస్థల షేర్లను పెంచడమే ఎగ్జిట్ పోల్స్ ఉద్దేశం: తులసి రెడ్డి ఆరోపణ

  • బీజేపీకి సాయం చేసిన కార్పొరేట్లకు సాయపడే ఉద్దేశం   
  • ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు  
  • ఎలక్షన్ కమిషన్ నియంతలా వ్యవహరిస్తోంది

సార్వత్రిక ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై వివిధ వర్గాలు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఫలితాలు ఉండడంతో ప్రతిపక్ష నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి కూడా తాజాగా ఎగ్జిట్ పోల్స్ ను గురించి స్పందిస్తూ, ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి ఆర్ధిక సాయాన్ని అందించిన కార్పొరేట్ సంస్థల షేర్లను పెంచడం కోసమే ఈ ఎగ్జిట్ పోల్స్ ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా, విజయవాడలోని 'ఆంధ్రరత్న భవన్' లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి తులసిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ గురించిన ప్రస్తావన తెచ్చారు. ఈ ఎగ్జిట్ పోల్స్ 5.33 లక్షల కోట్ల కుంభకోణమని అన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదనీ, కృత్రిమ ఎగ్జిట్ పోల్స్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అభ్యర్థనలను పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ ఒక నియంతలా వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు.

More Telugu News