Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని నాటకం.. దొంగను పట్టుకుంటామంటూ బైక్‌‌తో పరారీ

  • రంగారెడ్డి జిల్లాలోని ఫాతామాపూర్‌లో ఘటన
  • నిందితులు సికింద్రాబాద్‌కు చెందిన వారుగా గుర్తింపు
  •  ప్రార్థనల కోసం వచ్చి చోరీ

చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుంటామని నమ్మించిన ఇద్దరు యువకులు బైక్‌తో పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఫాతిమాపూర్‌లో జరిగిందీ  ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన క్రైస్తవ భక్తులు ప్రతి ఆదివారం ఫాతిమాపూర్ వస్తుంటారు. ఎప్పటిలానే హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ఆదివారం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాత్రి అక్కడే నిద్రపోయి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.

అయితే, తమ మొబైల్ ఫోన్ పోయిందని చర్చి ఫాదర్  సైమన్‌రెడ్డికి ఫిర్యాదు చేసి దానిని ట్రాక్ చేస్తామని చెప్పి ఆయన వద్ద  సెల్ తీసుకున్నారు. కాసేపు ఆ ఫోన్‌తో నటించిన అనంతరం దొంగ దొరికాడని, ఇక్కడికి కిలోమీటరు దూరంలోనే ఉన్నాడని నమ్మించారు. దొంగను పట్టుకుని సెల్‌ఫోన్‌ను తీసుకొస్తామని చెబుతూ అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి బైక్ తీసుకుని వెళ్లారు. అలా వెళ్లినవారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో బైక్‌తో వారు పరారయ్యారని గుర్తించారు. సీసీటీవీలను పరిశీలించారు. నిందితులైన యువకులు ఇద్దరూ సికింద్రాబాద్‌లోని ఓ కాలేజీలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసినట్టు పోలీసులు గుర్తించి, వారి కోసం గాలింపు మొదలెట్టారు. 

More Telugu News