Aishwarya Rai: వివేక్ ఒబెరాయ్ ట్వీట్‌తో దుమారం.. డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్

  • నెటిజన్ చేసిన మీమ్‌ను పోస్ట్ చేసి కలకలం రేపిన వివేక్
  • మండిపడుతున్న ప్రముఖులు
  • క్షమాపణలు చెప్పాలన్న మధుర్ బండార్కర్

బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ సరదాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారానికి కారణమైంది. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ను ఎగ్జిట్ పోల్స్‌తో పోల్చుతూ ఓ నెటిజన్ చేసిన మీమ్‌ను వివేక్ ట్వీట్ చేశాడు. ఇందులో మూడు ఫొటోలు ఉన్నాయి. ఐశ్వర్యరాయ్.. సల్మాన్‌తో ఉన్న ఫొటోను ఒపీనియన్ పోల్‌గా, వివేక్ ఒబెరాయ్‌తో ఉన్న ఫొటోను ఎగ్జిట్‌ పోల్స్‌గా, అభిషేక్ బచ్చన్, కుమార్తెతో కలిసి ఉన్న ఫొటోను వాస్తవ ఫలితాలుగా పేర్కొన్నారు. ఈ మీమ్‌ను ట్వీట్ చేసిన వివేక్.. క్యాప్షన్‌గా ‘హహహ.. క్రియేటివ్‌.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అని రాసుకొచ్చాడు.

వివేక్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌పై రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు మండిపడుతున్నారు. నటి సోనమ్‌ కపూర్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాలతోపాటు వివేక్‌పై విరుచుకుపడ్డారు. ఓ నటుడు అయి ఉండీ మరో నటిని కించపరిచేలా ఈ పోస్టులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధ్యత గల సెలబ్రిటీ అయి ఉండీ మరొకరి మనోభావాలను కించపరచడం దారుణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ స్పందించారు. వివేక్ వెంటనే ఈ ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక్ నుంచి తాను ఇలాంటి ట్వీట్‌ను ఊహించలేదన్న మధుర్.. విమర్శకులు ఎంతకైనా తెగిస్తారని, కానీ వివేక్ నుంచి ఇలాంటి ట్వీట్‌ను ఊహించలేదని అన్నాడు. బాధ్యత కలిగిన సెలబ్రిటీగా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు వేడుకోవాలని ట్వీట్ చేశాడు. కాగా, ఐశ్వర్యపై అనుచిత పోస్టు చేసిన వివేక్‌కు మహిళా కమిషన్ వివరణ కోరుతూ నోటీసులు పంపింది.

More Telugu News