Fakruddin: పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

  • వ్యవసాయ పనికి వెళ్లిన ఫక్రుద్దీన్ కుటుంబం
  • ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
  • వ్యవసాయ నివాసం వద్దకు చేరుకోగా పిడుగుపాటు

పిడుగుపాటు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనులకు వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్‌కు వ్యవసాయమే జీవానాధారం.

నేడు ఆయన తన కుటుంబంతో కలిసి వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వారంతా తమ వ్యవసాయ నివాసం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలోనే వారున్న చోట పిడుగు పడటంతో ఫక్రుద్దీన్‌ భార్య కాజాబి(38), కుమార్తె తబాసం(16), కుమారుడు అక్రమ్(12) అక్కడికక్కడే మృతి చెందారు. ఫక్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆయనను పరిగి ఆసుపత్రికి తరలించారు. ఈ పిడుగు పాటు కారణంగా ఫక్రుద్దీన్‌కు చెందిన రెండు మేకలు కూడా మృతి చెందాయి.

More Telugu News