brazil: బ్రెజిల్ బార్ లో కాల్పుల మోత.. 11 మందిని కాల్చిచంపిన దుండగులు!

  • పారా రాష్ట్రంలోని బెలెమ్ నగరంలో ఘటన
  • కార్లు, బైక్ లపై బార్ వద్దకు వచ్చిన ముఠా
  • ఓ నిందితుడిని సజీవంగా పట్టుకున్న పోలీసులు

బ్రెజిల్ లోని పారా రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోయారు. బెలెమ్ నగరంలోని ఓ బార్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మహిళలు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ అల్లరిమూక బైక్ లు, కార్లపై బార్ వద్దకు చేరుకుందని తెలిపారు.

కాల్పుల అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా, వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ సందర్భంగా వీరిని వెంటాడిన పోలీసులు ఓ నిందితుడిని పట్టుకున్నారనీ, మిగతావారు తప్పించుకున్నారని పేర్కొన్నారు. గ్యాంగ్ వార్ కారణంగా ఈ అఘాయిత్యానికి తెగబడ్డారా? లేక మరేదయినా కారణం ఉందా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News