East Godavari District: చేతబడి చేశాడన్న అనుమానంతో హత్య!

  • హత్యచేసి ఇసుకలో పాతిపెట్టిన నిందితులు
  • శవం పైకి తేలడంతో బట్టబయలైన వ్యవహారం
  • తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెంలో ఘటన

చేతబడి చేసి తన భార్యను చంపేశాడని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి అదను చూసి ఆ వృద్ధుడిని హత్యచేసిన సంఘటన ఇది. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేసిన పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయ.

గ్రామానికి చెందిన సొంది భద్రయ్య భార్య సొంది గంగమ్మ గత నెల 16వ తేదీన చనిపోయింది. అదే గ్రామానికి చెందిన తాటి కన్నయ్య (60) చేతబడి చేయడం వల్లే తన భార్య చనిపోయిందని భద్రయ్య అతనిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో కన్నయ్యను చంపేయాలని నిర్ణయించి నాగరాజు అనే స్నేహితుడి సాయం కోరాడు.

ఇద్దరూ ప్లాన్ వేసి, ఈనె 6వ తేదీన పనివుంది రావాలంటూ కన్నయ్యను ఇంటికి పిలిపించారు. ఇంటికి వచ్చిన కన్నయ్యను ఒకరు కాళ్లు పట్టుకోగా మరొకరు గొంతు నులిమి చంపేశారు. అనంతరం శవాన్ని పులివాగులోని ఇసుకలో పాతిపెట్టేశారు. కొద్దిరోజులకు మృతదేహం బయటకు తేలడంతో ఈనెల 13న స్థానిక వీఆర్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో కన్నయ్యను చంపేసింది భద్రయ్య, నాగరాజని తేలడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

More Telugu News