Tamil Nadu: భార్యపై కోపాన్ని రైలుపై చూపించిన యువకుడు!

  • తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఘటన
  • రైల్వే ట్రాక్‌పై బైక్ నిలిపి కూర్చున్న నిందితుడు
  • లోకో పైలట్ గుర్తించడంతో తప్పిన ప్రమాదం

ఇంట్లో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి నేరుగా రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని తన బైక్‌ను అడ్డం పెట్టి రైలును అడ్డుకున్నాడు. రైలు లోకో పైలట్ సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..  ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్‌ (26)కు శుక్రవారం భార్యతో పెద్ద గొడవైంది. దీంతో మనస్తాపం చెందిన షణ్ముగవేల్ తన బైక్‌పై నేరుగా తురుభువనం చేరుకుని లాడనేందల్‌ రైల్వే వంతెన కింద మద్యం తాగి అక్కడే నిద్రపోయాడు. ఉదయం బైకును తీసుకెళ్లి పట్టాలపై అడ్డంగా పెట్టి దానిపైనే కూర్చున్నాడు.

అదే సమయంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు లోకోపైలట్ పట్టాలపై బైక్ ఉన్న విషయాన్ని దూరం నుంచే గుర్తించి రైలును నిలిపివేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కిందికి దిగిన ప్రయాణికులు పట్టాలపై బైక్‌పై కూర్చున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయారు. బైక్ తీయమని ఎంతగా మొత్తుకున్నా షణ్ముగవేల్ వినిపించుకోలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే అతడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు షణ్ముగవేల్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News